
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో మే 23వ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలను సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం, అదనపు ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ లతో కలిసి అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పరీక్షా కేంద్రాలలో తరగతి గదులను పరిశీలించాలని, త్రాగునీరు, విద్యుత్తు, పరిసరాల పరిశుభ్రత, వైద్య శిబిరాలు వంటి మౌలిక వసతుల ఏర్పాట్లపై పర్యవేక్షించాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు భారీ బందోబస్తుతో పోలీసు శాఖ భద్రతతో ఆయా పరీక్ష కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేయాలని, రవాణా శాఖ అధికారులు బస్సుల పనితీరును పర్యవేక్షించాలని అన్నారు. పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని, పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్య, వైద్య, పోలీసు, రవాణా శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..

