
సర్కార్కు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ఉగ్రవాదులు అలర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాదులు భారీ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఢిల్లీతో పాటు దేశంలోని కీలక నగరాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాద సంస్థలు అల్లకల్లోలం చేసే అవకాశం ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో నగరంలో అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో దాదాపు 10 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. అంతేగాక, ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేశారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా వెయ్యికి పైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈనెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులు మూసివేయడానికి సిద్ధమయ్యారు..

