
హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్ నారాయణ కళాశాల బ్రాంచిలో ఒక విద్యార్థికి ఫీజు బకాయి మాఫీ చేసి టీసీ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.. ఓ విద్యార్థి నాయకుడు పెట్రోల్ పోసుకోగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పందించారు.
“కళాశాల యాజమాన్యాన్ని సాయంత్రంలోగా నివేదిక అడిగాం. అది వచ్చాక చర్యలు తీసుకుంటాం. ఏ కాలేజ్ కు సర్టిఫికెట్స్ ఆపే హక్కు లేదు. ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులు ధైర్యంగా ఉండండి.. మేం మీతో ఉన్నాం. ఫీజుల విషయంలో ఇబ్బందులు ఉంటే నేరుగా పిర్యాదు చేయండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకోవాలి.. లేదంటే మేం చర్యలు తీసుకుంటాం” అని జలీల్ హెచ్చరించారు..

