ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య హత్య ఘటనపై ఇంటర్ బోర్డు చర్యలకు దిగింది. విద్యార్థి చదివిన నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య హత్య ఘటనపై ఇంటర్ బోర్డు చర్యలకు దిగింది. విద్యార్థి చదివిన నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ అనుమతిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ చర్చలు జరిపారు. తప్పుడు ప్రకటనల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అదనపు సమయం తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు. నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలోని తరగతి గదిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. సాత్విక్ మృతికి కారకులైన వారిపై 305 సెక్షన్ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
• ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి: బాలల హక్కుల కమిషన్,
ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాల నియంత్రణకు ప్రత్యేక సంస్థ లేదా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి బాలల హక్కుల కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల మరణాలకు దారితీస్తున్న పరిస్థితులను నియంత్రించాలని సర్కారుకు సూచించినట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను తీసుకురావాలని కమిషన్ సిఫార్సు చేసింది. ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు, విధివిధానాల రూపకల్పనలో బాలల కమిషన్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని శ్రీనివాసరావు తెలిపారు.

