జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రంజాన్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, మంచిర్యాల ఎ. సి. పి. ప్రకాష్ లతో కలిసి మండలాల తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసంను పురస్కరించుకొని పండుగను సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. రంజాన్ మాసం, ఇఫ్తార్ నిర్వహణ కొరకు సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలపై శ్రద్ధ వహించాలని, ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, మార్కెట్, మసీదుల సమీపంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మసీదులు, ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అంతర్గత రహదారులలో సరైన లైటింగ్ వ్యవస్థ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

