జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలులో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా అటవీ అధికారి శివ్ అశిష్ సింగ్, లతో కలిసి హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి స్థాయిలో జరిగేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని 311 గ్రామపంచాయతీలలో 15వ ఆర్ధిక సంఘం ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, త్రాగునీరు, సి.సి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యం, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గ్రామాలను పరిశు భ్రంగా ఉంచడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, త్రాగునీరు, ఆహార పదార్ధాలు, శుభ్రత అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఆయా మండలాలు, గ్రామపంచాయతీల అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని తెలిపారు. వర్షాకాలం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రాత్రి వేళలలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ దీపాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేవించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగునీరు అందించాలని, పైవైన్ల మరమ్మత్తు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీల సంక్షేమం, కవ్వాల్ అభ్యయారణ్యం, కవ్వాల్ వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అటవీ సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రహదారులు-భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రహదారులు, అంతర్గత రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు చేపట్టి నిర్దేశత లక్ష్యాలను సాధించే దిశగా అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల సంబంధిత పనుల నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, మిషన్ భగీరథ ఈ. ఈ. అంజన్ రావు, విద్యుత్ శాఖ ఎస్. ఈ. శేషారావు, జిల్లా అధికారులు, జెడ్.పి.టి.సి.లు, ఎం.పి.పి.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

