Friday, July 3, 2026
HomeTelanganaప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

📰 Generate e-Paper Clip

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సి. సుబ్బారాయుడు

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సి. సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ వరద ప్రభావిత, ముంపు ప్రాంతాలలో ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నం.7671001703 లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ 24/7 వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందికి సెలవులు రద్దు చేయడం జరిగిందని, అత్యవసర సేవలలో వెంటనే స్పందిస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. అన్ని రకాల మందులను ఆశ కార్యకర్త వరకు అందజేయాలని, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో 21 ఆరోగ్య కేంద్రాలలో ఎపిడిమిక్ సెల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కార్యాలయంలో డి.ఎస్.ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, ఈ సెల్స్ 24 గంటలు పని చేస్తాయని తెలిపారు. జిల్లాలో 27 వరద ప్రభావిత గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఈ క్రమంలో హై రిస్క్ గ్రామాల నుండి 17 మంది గర్భవతులను ఆసుపత్రులకు తరలించడం జరిగిందని, వీరిలో 8 మంది ప్రసవించగా మిగతా 9 మందిని వారి ప్రసవ తేదీ ప్రకారంగా పర్యవేక్షించడం జరుగుతుందని, చెన్నూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 4 మంది, బెల్లంపల్లిలోని ఆసుపత్రిలో 2 మంది, జిల్లా ఆసుపత్రిలో 3 మంది ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాలలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని, వైద్య సిబ్బంది సహాయక సిబ్బంది శిబిరాలకు హాజరు కావాలని ఆదేశించారు. జిల్లాలోని 36 పునరావాస కేంద్రాలలో వైద్యాధికారులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందితో వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, మునిసిపల్ సిబ్బంది సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం కావడంతో అంటూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై వివరించాలని, కీటక జనిత వ్యాధులు, మలేరియా, డెంగ్యూ ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు తమ పరిధిలో వ్యాధులను గుర్తించడంతో పాటు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని, కాచి చల్లార్చి వడపోసిన మంచినీటిని త్రాగాలని, గర్భవతులు, పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు, ఓడోమాస్ క్రీములు వినియోగించాలని, దోమల వృద్ధిని నిరోధించే విధంగా పారిశుద్ధ్య చర్యలు పాటించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించి విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వెంటనే సమీప వైద్యాధికారులను సంప్రదించాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పాముకాటు, తేలుకాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అన్ని గ్రామాలలో ఓ ఆర్ ఎస్ ను నిల్వ ఉంచుకోవాలని, త్రాగునీటి వనరులలో క్లోరినేషన్ చేయించాలని తెలిపారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు విశ్వేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.