చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు
ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా? అని ప్రజల ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా రోడ్డుమీద దర్జాగా మాషా అల్లా బిర్యాని సెంటర్ కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు, పాదాచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిర్యాని సెంటర్ వద్దకు వచ్చే వాహనాలు రహదారిపై అడ్డంగా నిలిపివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో జనసమూహం పెరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగితే గానీ అధికారులు పట్టించుకోరా అని వాహనదారులు, పాదాచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించి పరిస్థితిని పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే రహదారిపై కొనసాగుతున్న మాషా అల్లా బిర్యాని సెంటర్ నిర్వాహకుడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు ప్రజలు కూడా సహకరించి వాహనాలను రహదారిపై అడ్డంగా నిలిపివేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు..

