
డిల్లీ: కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం కీలక పదవిలో నియమించింది. టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ గా ఆయనను నియమిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. తక్షణమే ఆయన నియామకం అమలులోకి వస్తుందని వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు ఈ నియామకం చేపట్టినట్లు వివరించారు. గతంలో ఆయన పీసీసీ పదవి ఆశించారు. అయితే ఆ పదవిని రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. అప్పట్లో బహిరంగంగానే ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అసంతృప్త నేతలతో రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ దశలో పార్టీలో ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..

