
ఆమె వైఖరిపై కేసీఆర్ తో మాట్లాడతా..?
మీర్ పేట్ ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జీహెచ్ఎంసీ మాజీ మేయర్, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీర్ పేట్ ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని తీగల ఆరోపించారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. అభివృద్ధిని ఆమె గాలికొదిలేశారని విమర్శించారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్తో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున సబితా ఇంద్రారెడ్డి, తెరాస నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేశారు. తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం ఆమె తెరాసలో చేరడం.. మంత్రి పదవి దక్కించుకోవడం జరిగిపోయాయి. అప్పటి నుంచి నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సబితా ఇంద్రా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు..

