
మంచిర్యాల జిల్లా: జిల్లాలో సాదా బైనామాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 2014 జూన్ 2కు ముందు ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. 2020 అక్టోబర్ 31 వరకు 1, 896 దరఖాస్తులు వివిధ మండలాల నుంచి వచ్చాయి. మొదట వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాలోని వాటికి మాత్రమే అవకాశం కల్పించింది. అనంతరం నవంబర్ 1 నుంచి 10వరకు గడువు పొడిగించింది. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వారికీ సాదాబైనామాల అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ‘మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన నస్పూర్, క్యాతన్పల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లోని వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది.
పది రోజుల వ్యవధిలోనే 24 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించి క్రయవిక్రయదారులను ఆమోదంతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు ఉంటాయని దరఖాస్తుదారులు భావిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాలతో అయోమయంలో పడ్డారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించడంతో కొత్త గా ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి..

