
ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, క్షీరసాగర్లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు వంటి వివిధ హోదాలను చేపట్టి పాఠశాల పరిపాలనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా శివకుమార్, మండల విద్యాశాఖాధికారిగా సందీప్, ప్రధానోపాధ్యాయుడిగా అనంత్ బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తరగతులను నిర్వహించారు. పరిపాలనలోనూ, బోధనలోనూ విద్యార్థులు చూపిన చొరవ, నాయకత్వ లక్షణాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రవికుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. ప్రకాష్, శోభారాణి, విద్యాధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎండి యూసుఫ్, సునంద, రాంనర్సయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహస్వామి, శంకర్, సాయిలు పాల్గొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

