
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ కౌటాల మండలం కన్నెపెల్లి గ్రామ పంచాయతీలో నిధుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి జోత్స్న పాలకవర్గానికి ఎలాంటి సమాచారం అందించకుండా నిధులు పక్కదారి పట్టించారని సర్పంచి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంజూరైన నిధుల విషయమై సర్పంచి రమేష్ కార్యదర్శిని వివరాలు అడగడంతోనే అసలు వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీకి రూ. 1.70 లక్షలు మంజూరయ్యాయి. డిజిటల్ ‘కీ’ ద్వారా మండల పరిషత్ కార్యాలయంలో నిధుల లావాదేవీలను పరిశీలించిన సర్పంచి రమేష్ పూర్తి సమాచారం తెలుసుకొని గ్రామ పంచాయతీలో రూ.3లక్షల వరకు నిధులు పక్కదారి పట్టినట్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటపడటంతో కార్యదర్శికి మద్దతుగా ఓ పోలీసు అధికారి పంచాయతీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆపరేటర్లపై కార్యదర్శుల ఫిర్యాదు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటర్లపై మండలంలోని కార్యదర్శులందరూ కలిసి ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఆపరేటర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంపీడీఓను సంప్రదించగా. కన్నెపెల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందజేస్తామన్నారు..

