కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్ వాళ్ళు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని తల్లిని కోల్పోయి ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న నలుగురు బిడ్డలతో తండ్రి చెప్పిన చివరి మాటలివి.
పిల్లలతో మాట్లాడి తండ్రి ఆత్మహత్య
2 వారాల కిందటే తల్లి బలవన్మరణం
అనాథలుగా నలుగురు బిడ్డలు
పిల్లలను అధికారులకు అప్పగిస్తూ ఉత్తరం రాస్తున్న ప్రసాద్ బాబు
ఆంజనేయులు న్యూస్, అన్నమయ్య జిల్లా: ‘కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్ వాళ్లు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని తల్లిని కోల్పోయి ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణలో ఉన్న నలుగురు బిడ్డలతో తండ్రి చెప్పిన చివరి మాటలివి. భవిష్యత్తును విస్మరిస్తూ సోమవారం ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు పిల్లలను అనాథలను చేశాడు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కలమడి ప్రసాద్ బాబు (35), సుకన్య (28) దంపతులు. వీరికి ఐశ్వర్య, అక్షిత, అరవింద్, అవినాష్ సంతానం. బేల్దారి పనులు చేసుకుంటూ ప్రసాద్ బాబు కుటుంబాన్ని పోషించేవాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు వారాల కిందట భార్య క్షణికావేశంతో ఇంట్లో ఉరేసుకున్నారు. అప్పటినుంచి ప్రసాద్ బాబు మనోవేదనకు గురయ్యాడు. తానుకూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక అంగన్వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29న ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. తల్లి లేనందున తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్ లో చేర్చారు. ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రసాద్ బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. కాసేపు వారితో హాయిగా గడిపాడు. సోమవారం ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను అప్పగించే ముందురోజునుంచే తాను చనిపోతానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తమను ప్రసాద్ బాబు కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కౌన్సెలింగ్ చేసినా నిష్ఫలమైందని వాపోయారు.

