
అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల అరెస్టు
నకిలీ నోట్లు ప్రదర్శిస్తున్న డీసీపీ సాయిచైతన్య
హైదరాబాద్: జిరాక్స్ సెంటర్ మాటున నకిలీ కరెన్సీ ముద్రించి హైదరాబాద్ సహా వేర్వేరు నగరాల్లో చలామణి చేస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు సభ్యుల్ని ఎంజీబీఎస్ దగ్గర దక్షిణ మండల టాస్క్ఫోర్స్, మీర్ చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు హైదరాబాదీ ఉన్నారు. వీరినుంచి రూ.2.5 లక్షల (100, 200, 500, 2వేల నోట్లు) నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్ణాటకకు చెందిన శేఖర్ పరారీలో ఉన్నాడు. వివరాలను గురువారం పురానీహవేలీలోని పోలీసు కమిషనరేట్ టాస్క్ ఫోర్సు అదనపు డీసీపీ స్నేహమెహ్రా, మీర్చాక్ ఏసీపీ ప్రసాదావు, ఇన్స్పెక్టర్ ఎం. అప్పలనాయుడు, టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేంద్రతో కలిసి దక్షిణ మండలం డీసీపీ పి. సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు.
కర్ణాటకలోని హుల్సూరుకు చెందిన శేఖర్ స్థానికంగా ఎన్ఎస్ కంప్యూటర్స్ జిరాక్స్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్లు ముద్రించాలని పథకం పన్నాడు. పరికరాలు, యంత్రాన్ని సేకరించి ముద్రణ మొదలు పెట్టాడు. ఈనోట్లను సమీప బంధువు, లాతూర్ జిల్లా ఇస్లాంపురకు చెందిన సయ్యద్ అన్సార్(27)తో మార్కెట్ లో చలామణి చేయించాడు. ఇందుకు రూ.8 వేల అసలైన కరెన్సీకి రూ.50 వేల నకిలీ నోట్లను విక్రయించాడు. అతడు హైదరాబాద్ లో ఫలక్నుమాకు చెందిన స్కూల్ బ్యాగుల తయారీదారు షేక్ ఇమ్రాన్ (33)కు కూడా విక్రయించాడు. రూ.15వేలు చెల్లిస్తే రూ.50వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. ఈ క్రమంలో అన్సార్ హైదరాబాద్ కు వచ్చాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్, మీర్చాక్ పోలీసులు అన్సార్, ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారు..

