
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్. డబ్ల్యు. ఓ.లు, తహశిల్దార్లు మండల పరిషత్ సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మండల బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించి మండల పరిషత్ సంక్షేమ అధికారులకు అప్పగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఎం.ఎల్.ఎస్. పాయింట్ల గోదాములను పరిశీలించి సంబంధిత నివేదికలను అందించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ఓటరు పేరు ప్రక్కన వారి ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాలని, ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటి వరకు 81 శాతం పూర్తయిందని, మిగతా వారి వివరాలు కూడా సేకరించి జిల్లాను 100 శాతం ప్రకటించే విధంగా తహశిల్దార్లు, బూత్ స్థాయి అధికారులతో సమావేశమై కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు విషయంలో తహశిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని, స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ఆక్రమణలను, అక్రమ తరలింపును అరికట్టాలని తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల పథకం, జి.ఓ. నం.76 ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులైన లబ్దిదారులకు లబ్ది చేకూరే విధంగా కృషి చేయాలని తెలిపారు.

