జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి కె. చిన్నయ్యతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ. దివ్యాంగుల సంక్షేమం కోసం, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తుందని తెలిపారు. దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అనేక మంది దివ్యాంగులు వివిధ రంగాలలో అత్యున్నత స్థాయిలో నిలిచి ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇదే స్ఫూర్తితో అందరు ముందుకు సాగాలని అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు పరుగు పందెం, షాట్పుట్, చెస్, క్యారమ్, జావెలిన్ త్రో, మ్యూజికల్ చైర్ పోటీలలో జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, దివ్యాంగుల సంఘాల నాయకులు మహేందర్, తిరుపతి, సతీష్, భాగ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

