
ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీసుల సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా చేతన ఫౌండేషన్, రోటరీ క్లబ్ (ఖమ్మం) వారి సహకారంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద బుధవారం కృత్తిమ కాళ్ళు ఉచితంగా అమర్చారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు పోలీసు ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, చేతులు అమర్చడం, ఉచిత కుట్టుమిషన్లు, దుప్పట్ల పంపిణీ, ఇతర సేవ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ మాట్లాడుతూ,. ప్రమాదవశాత్తు లేదా మధుమేహ వ్యాధి వల్ల కాళ్లు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కృత్తిమ కాళ్లు ఇచ్చుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఎంపిక శిబిరంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుండి మొత్తం 108మంది వికలాంగులు హాజరయ్యారు, ఇందులో 94 మందికి కాళ్లు, 12 మందికి చేతులు బిగించారు. వీరందరికీ గత నెల 06 న కాళ్ల పరీక్షలు నిర్వహించి, వారి వారి కొలతల ఆధారంగా, కృత్రిమ కాళ్ల ను తయారు చేశారు. ఎంతో మంది పేదల కోసం, ఈ గొప్ప కార్యక్రమం చేపడుతున్న చేతన ఫౌండేషన్ (చైర్మన్ వెనిగల్ల రవికుమార్), చైర్మన్ దొడ్డపనేని సీతారామయ్య, రోటరీ క్లబ్ సాంబశివరావు ఖమ్మం వారిని ఎస్పీ గారు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా అదనపు ఎస్పి (అడ్మిన్) అచ్చేశ్వర రావు, అదనపు ఎస్పీ (ఎ. ఆర్) భీమ్ రావు, చేతన ఫౌండేషన్ అధ్యక్షులు సీతారామయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు దొడ్డపనేని సాంబశివరావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్ వైద్య సిబ్బంది, జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

