
హైదరాబాద్: ఏడెకరాల విస్తీర్ణం.. నాలుగు టవర్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో నిర్మితమైన పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్ర అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలియతిరిగారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి సెంటర్ విశేషాలు తెలుసుకున్నారు.
సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం.. పోలీసు విభాగానికి మూడో నిఘా నేత్రంగా పనిచేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.

