జిల్లాలో వ్యాపారుల ఇష్టారాజ్యం

కెరమెరి సంతలో రోడ్డుపక్కన చిరుతిళ్ల విక్రయాలు
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో ఆహార తనిఖీలు లేక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తిర్యాణి మండలంలో వారసంతలో మిరపకాయ బజ్జీలు తిని 38 మంది ఆసుపత్రి పాలయ్యారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ కు ఆహార తనిఖీల అధికారిని కేటాయించారు. సదరు అధికారి జిల్లాలో తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం సరకులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దుకాణాలు, హోటళ్లపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఇష్టానుసారంగా తిను బండారాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి తిన్నవారు అస్వస్థతకు గురవుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత కొత్త కొత్త దుకాణాలు వెలుస్తున్నాయి. హోటళ్లు, పిజ్జా కేంద్రాలు, ఐస్క్రీమ్ పార్లర్లు, బేకరీలు.. ఇలా పదుల సంఖ్యలో ఏర్పడుతున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి హోటళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నా.. నాణ్యత, శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిను బండారాల తయారీలో నాసిరకం సరకులు వాడుతున్నారు. ఒకసారి వాడిన నూనెను మరోసారి వేడి చేయకూడదు. కానీ పలుమార్లు అదే నూనె వినియోగిస్తుండటంతో అనారోగ్యానికి దారి తీసే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. మిఠాయిల్లో వివిధ రకాల రంగులు కలపడంతో అజీర్ణానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు.

తిర్యాణిలో బజ్జీలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
గడువు తీరితే పారేయడం లేదు..
కొందరు వ్యాపారులు గడువు తీరిన సరకుల పొట్లాలను పారేయకుండా విక్రయిస్తున్నారు. కొన్ని హోటళ్లలో తయారు చేసిన ఆహార పదార్థాలు, మిఠాయిలపై మూతలు ఉంచడం లేదు. వాటిపై ఈగలు, దోమలు వాలడంతో అవి తిన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. మండల కేంద్రాల్లో సంతల రోజు రోడ్లపై తినుబండారాలు రాసులుగా పోసి విక్రయిస్తున్నారు. వాహనాలు, ప్రజలు నడిచే సమయంలో వెలుబడిన దుమ్ము వాటిపై పడటం, ఈగలు, దోమలు వాలడంతో అవి తిన్నవారు. అస్వస్థతకు గురవుతున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు..
• తిర్యాణి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సంత జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు ఓ వ్యాపారి తయారు చేసిన మిర్చీ బజ్జీలు కొనుక్కొని తిన్నారు. అవి తిన్న వారికి అదేరోజు అర్ధరాత్రి నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. వివిధ గ్రామాలకు చెందిన 38 మంది ఆసుపత్రిపాలయ్యారు.
• జిల్లా కేంద్రంలోని ఓ పిజ్జా కేంద్రంలో గతేడాది ప్రణయ్ పిజ్జా కొన్నారు. అది ముక్కలు చేసి కొంత తిన్నారు. కుళ్లిపోయి దుర్వాసన రావడంతో వెంటనే యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం ఆయనకు కడుపునొప్పి రావడంతో వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు.
• కొన్నిరోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ మిఠాయి కేంద్రంలో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దిల్ పసంద్ కొన్నారు. అది తినేందుకు ముక్కలు చేయగా లోపల పురుగు రావడంతో యజమానిని ప్రశ్నించగా… నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
• జిల్లాలోని పలు గురుకులాలు, పాఠశాలల్లో సైతం విద్యార్థులు ఆహారం వికటించి అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి.

