భారాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఉదయం బండి సంజయ్ ట్వీట్ చేస్తూ.. గవర్నర్ కు దక్కదు గౌరవం. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళల పై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం’ అంటూ రాసుకొచ్చారు.
దీనిపై కవిత కౌంటర్ గా ..” పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం. మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన భాజపా ఎంపీపై చర్యలు ఉండవు. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో… భేటీ పడావో. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి. మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం. ఆడ బిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం. ఆడబిడ్డ తలచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది” అని ట్వీట్ చేశారు.

