తాండూరు, సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని తాండూరు మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెండ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రజకుల హక్కుల కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆమె ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ రజకుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల రజక సంఘం అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు చంద్రగిరి విఘ్నేష్, కోశాధికారి చంద్రగిరి సాంబయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రజక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
