మంచిర్యాల, సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
క్యాతన్పల్లి ప్రెస్ క్లబ్ (259/19) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కలవల శంకర్, ప్రధాన కార్యదర్శిగా మెరుగు నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కలవల శంకర్, ప్రధాన కార్యదర్శి మెరుగు నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయ రంగంలో నిస్వార్థ సేవలందిస్తున్న జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీతో పాటు రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలో జరిగే కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించాలని ప్రజలను కోరారు. అలాగే ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు తమకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
