మంచిర్యాల, ఆగస్టు 27, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం నిర్లక్ష్యంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించే వాహనాలు సరైన రక్షణ చర్యలు లేకుండా రోడ్లపై ప్రయాణిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెత్త తరలింపు వాహనాలకు వెనుక భాగంలో సరైన మూతలు, రక్షణ వలలు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్లే సమయంలో చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడిపోతున్నాయి. దీంతో ప్రధాన రహదారులపై చెత్త పేరుకుపోవడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోంది. రోడ్లపై పడుతున్న చెత్తతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల టైర్ల కింద చెత్త, ప్లాస్టిక్ కవర్లు పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పట్టణ పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పిస్తుండగా.. మరోవైపు చెత్త తరలించే సమయంలోనే రోడ్లపై వ్యర్థాలు పడిపోవడం విమర్శలకు తావిస్తోంది. చెత్త తరలింపు వాహనాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్త తరలింపు వాహనాలకు పూర్తిస్థాయి మూతలు, రక్షణ వలలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపై చెత్త పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
