మంచిర్యాల ఆగస్టు 27, ( ఆంజనేయులు న్యూస్ )
కిడ్నీ వ్యాధులకు యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మామిడి ప్రణీత్ రామ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఏబీఓ-ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, స్వ్యాప్ ట్రాన్స్ప్లాంట్ వంటి అధునాతన విధానాల ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత ఖచ్చితత్వంతో, తక్కువ రక్తస్రావంతో పాటు రోగులు త్వరగా కోలుకునేలా అధునాతన రోబోటిక్ కిడ్నీ శస్త్రచికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. సీఏపీడీ, హీమోడయాలసిస్తో పాటు అత్యవసర, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు సీఆర్ఆర్టీ వంటి అధునాతన డయాలసిస్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు, కిడ్నీ స్టోన్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కిడ్నీ స్టోన్ చికిత్సలో లేజర్, షాక్వేవ్ థెరపీ వంటి సదుపాయాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ ప్రణీత్ రామ్ అన్నారు. పాదాల వాపు, మూత్ర విసర్జనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను తొలిదశలో గుర్తించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ మల్లేష్ పాల్గొన్నారు.
