సకాలంలో గుర్తిస్తే మెరుగైన చికిత్స సాధ్యం
హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ సాయి సతీష్ సూచనలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: న్యూరో సంబంధిత వ్యాధులు, ఫిట్స్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ కె సూచించారు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అంకం మల్లేష్ మేనేజర్ నిర్వహణలో బుధవారం మంచిర్యాలలోని ఓ ప్రముఖ హోటల్లో న్యూరో, ఫిట్స్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల కారణంగా న్యూరో సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. తలనొప్పి, మతిమరుపు, చేతులు–కాళ్లలో బలహీనత, తల తిరగడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఫిట్స్ సమస్య వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదిస్తే ఆధునిక వైద్య విధానాలతో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పారు. స్ట్రోక్ సంభవించిన తర్వాత 4.5 గంటలలోపు థ్రాంబోలైసిస్ ప్రక్రియ నిర్వహించడం అత్యంత కీలకమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫిట్స్ను మూఢనమ్మకాలతో అనుసంధానం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. వైద్య పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా న్యూరో సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఫిట్స్ వచ్చిన వ్యక్తిని ఎలా సంరక్షించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి అంశాలపై వైద్యులు ప్రజలకు వివరించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు..

