కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని పేర్కొన్నారు.
ఆంజనేయులు న్యూస్, పుదుచ్చేరి: తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈమేరకు పుదుచ్చేరిలో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. “ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశా. దాన్ని పక్కనపెట్టి రాజభవన్ లొనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితమే సమాచారమిచ్చారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా కొందరిని సన్మానించాం. గణతంత్ర వేడుకలు ప్రజల మధ్య వేడుకలు జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చింది” అని గవర్నర్ అన్నారు.

