
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ టికెట్స్ దందా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 టికెట్లు, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుగులోత్ వెంకటేశ్, ఇస్లావత్ దయాకర్, గుగులోత్ అరుణ్ గుర్తించారు. నిందితులు రూ.850 టికెట్లను రూ.11 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ లో నిర్ణయాత్మక మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ మైదానం వద్ద 2,500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మైదానం చుట్టుపక్కల 15 కి.మీ మేర నిఘా ఏర్పాటు చేశారు. సుమారు 300 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

