
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఎన్నికల్లో ఒడిపోవడంతో మతిభ్రమించినట్లు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీ లకు కాబోయే చైర్మన్ లు డాక్టర్ రావుల ఉప్పలయ్య, వేణు మీడియా సమావేశంలో దివాకర్ రావు తీరుపై మండిపడ్డారు. 20 యేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా మంచిర్యాల ను అభివృద్ధి చేయలేని దివాకర్ రావు ప్రేమ్ సాగర్ రావు పై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని గమనించి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు మెచ్చిన ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిధులు రాకుండా అడ్డుకుంటుందని దివాకర్ రావు చేస్తున్న ఆరోపణలు విడ్డురంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యేగా నీ హయాంలో నువ్వు ఏమి చేశావని ప్రశ్నించారు. ప్రేమ్ సాగర్ రావు ఒక విజన్ ఉన్న నాయకుడని మంచిర్యాల నియోజకవర్గమును పురోగతిలోకి ఎలా తీసుకువెళ్ళాలో భవిష్యత్ ప్రణాళికను రూపొందించి ముందుకు పోతున్నారని అన్నారు. దివాకర్ రావు అసత్య ఆరోపణలు చేసే పద్ధతి మార్చుకోకపోతే ఆయన హయాంలో చేసిన అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తగిన రీతిలో బుద్ధి చెప్పేలా చేస్తామని హెచ్చరించారు. ఓపిక ఉంటే అభివృద్ధి ఎలా చేయాలో సలహాలు ఇవ్వండి లేకపోతే నోరుమూసుకుని ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. ప్రతి పక్షంలో ఉన్న సమయంలో ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి విషయంలో అనేక సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు.
మాతా, శిశు కేంద్రం, ఐబీ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం వద్దని మొత్తుకున్నా అక్కడ భవనాలు నిర్మించి ప్రజా ధనం దుర్వినియోగం చేసారని ధ్వజమెత్తారు. ప్రేమ్ సాగర్ రావు ప్రజాహిత కార్యక్రమాలకు చేసే సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు ఆగిపోయాయని దివాకర్ రావు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనకు వచ్చే కమీషన్లు, ట్రాన్సుఫర్లలో వచ్చే ఆదాయం ఆగిపోయాయి తప్ప ఎక్కడా అభివృద్ధి నిలిచిపోలేదని వేణు అన్నారు. నస్పూర్ మున్సిపల్ లో జరిగిన అవినీతి, అక్రమాలను తవ్వితీసి చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. అవినీతిలో దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్ రావు, ఇతర నేతల వాటాల లెక్క తీస్తామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలో రహదారి ఏర్పాటు కోసం రియల్టర్ దగ్గర ఎంత కమీషన్ నొక్కారో అది కక్కిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రేమసాగర్ రావు పై ప్రజల్లో విశ్వాసం ఉందని తెలిపారు.

