తెలంగాణ: టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించేలా నిర్ణయం తీసుకున్నారు. రైల్వేస్టేషన్ కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 టికెట్ తో ప్రయాణికులు ఒక బస్టాప్ నుంచి మరో బస్టాప్ వరకు వెళ్లవచ్చు. కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడిచి వెళ్తూ అవస్థల పాలవుతున్నారు. ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇవాళ ఆటోలు, క్యాబ్ బంద్ దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. మరిన్ని వివరాలకు 9959226160, 9959226154 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది..