Telugu Updates
Logo
Natyam ad

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

మంచిర్యాల జిల్లా: జిల్లా పరిధిలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి మాడ్యూల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో భూ రికార్డులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను అభినందించారు. భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ కార్యక్రమం ద్వారా 95 శాతం భూ రికార్డులు పకడ్బంధీగా ఉన్నాయని, మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధరణి వెబ్సైట్లో ఏర్పాటు చేసిన 33 మాడ్యుల్స్ లో భూ యజమాని పేరు, భూ విస్తీర్ణం, భూమి రకం మార్పులకు దరఖాస్తు అవకాశం కల్పించామని, సదరు దరఖాస్తులలో ఆధారాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులను తనిఖీ చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 33 మాడ్యూల్స్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. జూలై 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 11న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమీక్ష నాటికి జి.ఓ. 58 క్రింద వచ్చిన దరఖాస్తుల ప్రాధమిక విచారణ ప్రక్రియ 100 శాతం పూర్తి చేసి ఆ సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి 5 మండలాలకు ఒక బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల కేంద్రాలలో నిర్వహించాలని, రెవెన్యూ సదస్సులను విస్తీర్ణం కలిగిన వేదికల్లో నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్, జిరాక్స్ మెషిన్, కౌంటర్లు, మొబైల్ మీ-సేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు, మండల కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు పాల్గొనాలని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సదస్సులో ప్రణాళిక సరిహద్దు జిల్లాల అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని ఖరారు చేయాలని, మండలాల్లోని గ్రామాలను విభజించి, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే తేదీల కార్యచరణ రూపొందించి గ్రామాలలో టాం-టాం ద్వారా ప్రచారం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో, ప్రింట్ మీడియాలో కార్యచరణ ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం జిల్లా ప్రణాళికతో హాజరు కావాలని, ఆ ప్రణాళికలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాలలో వేదికలు, కార్యచరణ వంటి లాజిస్టిక్స్ వివరాలు సిద్ధం చేయాలని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సమయంలో వచ్చిన దరఖాస్తులను 100 శాతం అర్హత మేరకు పరిష్కరించాలని, కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు, సరైన ధృవపత్రాలు సమర్పించని కేసుల వివరాలతో కూడిన సమాధానం వారికి అందజేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ఆగస్టు 15వ తేదీ నాటికి బి.సి. ఎస్.సి. స్టడీ సర్కిల్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలాలు, భవనాలను ఎంపిక చేయాలని, జిల్లాలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం, గ్రామీణ క్రీడ ప్రాంగణాల పురోగతి వివరాలు సైతం తయారు చేయాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయని, రెవెన్యూ సదస్సుల నిర్వహణ కొరకు బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల కొరకు 4 మొబైల్ మీ-సేవ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు దరఖాస్తు సమయంలో వారి సమస్యను తెలుసుకొని, అర్ధం చేసుకొని సంబంధిత మాడ్యూల్స్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, మండలాల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..