మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: తాండూర్ మండలంలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో మండల ప్రత్యేక అధికారి గజానన్ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా బీజేపీ తాండూరు మండల అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100(వంద) రోజుల పని కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా 4 వేల కోట్లు తెలంగాణకు కేటాయిస్తుండగా అధికారుల అలసత్వంతో లక్ష్యం నీరుగారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ చట్టం ప్రకారం ఎవరైనా కూలీ, పని అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాలని లేనిపక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి, పని ప్రదేశాల్లో ఎండ నుంచి రక్షణకు గ్రీన్ టేంట్ ఏర్పాటు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇవేమి అమలు కావడం లేదని, అధికారులు సమయ పాలన పాటించకుండా, ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారని అధికారులు తీరుపై మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, మండల ఈజిఎస్ అధికారులు తీరు మార్చుకోవాలని, లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పట్టెం విష్ణుకళ్యాణ్,దూడపాక భరత్,తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్, ఆనంద్, శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎముర్ల ప్రదీప్, రాజయ్య, బానయ్య తదితరులు పాల్గొన్నారు..