నారాయణపేట జిల్లా: నారాయణపేట లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్వ సమీపంలో ఆయన వాల్మీకి బోయల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వాల్మీకి బోయల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. “బోయ వాల్మీకులారా కేసీఆర్ చరిత్ర రాయండి. భాజపా గెలిస్తే వాల్మీకిల సమస్యను పరిష్కరిస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చరు? మజ్లిస్ కేసీఆర్ కుమ్మక్కు వల్లే హిందువులకు అన్యాయం జరుగుతోంది. బాంచన్ బతుకులు కావాలా? పేదల రాజ్యం కావాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వరు.. కానీ కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు. కేసీఆర్ కుటుంబం నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటోంది.. తెరాస నేతలకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే. కేసీఆర్ ను గద్దె దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నాం.
నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లు.. నీళ్లు రావు. కేసీఆర్ ఫాంహౌజ్కు నీళ్ల కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రూ. వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నుంచి ఫాంహౌజు నీళ్లు తెచ్చుకున్నారు. రూ.3.4 కోట్లిస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావచ్చు. కేంద్రమంత్రి షెకావత్తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చు. కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లించారు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వండి. గడిల రాజ్యం పోవాలి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి” అని బండిసంజయ్ అన్నారు..