హోంగార్డు గొంతుకోసిన నిందితుడు.
తల్లి, సోదరుడిపై దాడి
గాయపడిన హోంగార్డు అశోక్, శ్రీకాంత్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భీమినిలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తల్లి, సోదరుడిపై దాడి చేశాడు. తన గొంతును కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా హోంగార్డుపై దాడి చేసి గొంతు కోసిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. భీమిని ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. భీమినికి చెందిన రాంటెంకి శ్రీకాంత్(28) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ తన తల్లి పోశక్కతో భూమి పంపకం విషయంలో గొడవపడ్డాడు. మాటామాట పెరగడంతో బ్లేడుతో తల్లి చేతిని గాయపరిచాడు. ఈ క్రమంలో అన్నయ్య రాంటెంకి శంకర్ అక్కడికి వచ్చాడు. తనపై దాడికి వస్తున్నాడేమోననే అనుమానంతో శంకర్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు. అనంతరం శ్రీకాంత్ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శంకరన్ ను చికిత్స నిమిత్తం బెల్లంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీకాంత్ ను ఓ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో దారి మధ్యలో వెంబడి ఉన్న హోంగార్డు అశోక్ ను వెనుక నుంచి దాడి చేసి బ్లేడ్ తో గొంతు కోశాడు. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. హోంగార్డు అశోక్ మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.