Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 5:57 pm Posted by : Anjaneyulu Dega

జ్ఞాన భారతం విజయవంతానికి కృషి చేయాలి: అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య

మంచిర్యాల, సెప్టెంబర్‌ 17, ( ఆంజనేయులు న్యూస్ )

జిల్లాలో జ్ఞాన భారతం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో సంబంధిత జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్‌ కమిటీ, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, మఠాలు, పరిశోధనా సంస్థలు, వ్యక్తుల వద్ద ఉన్న పురాతన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, శిలాశాసనాలు, చారిత్రక పత్రాలను గుర్తించి డిజిటలైజేషన్‌ చేసి భద్రపరచాలని సూచించారు. ప్రజల వద్ద ఉన్న అరుదైన గ్రంథాలు, పాత పత్రాల సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు. పురాతన దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఉన్న ప్రాచీన గ్రంథాల వివరాలను కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సేకరించాలని తెలిపారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలు, స్థానిక వారసత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భవిష్యత్‌ తరాలకు అందుబాటులో ఉంచడంతో పాటు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు జ్ఞాన భారతం కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.కృష్ణమూర్తి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.