Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:20 pm Posted by : Anjaneyulu Dega

వేధింపులపై మహిళలకు షీ టీమ్ పోలీసుల అవగాహన

మంచిర్యాల సెప్టెంబర్ 11, ( ఆంజనేయులు న్యూస్ )

మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు. గోదావరి రోడ్డులోని ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలకు శుక్రవారం షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ శ్రీమతి హైమ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, వేధింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది వివరించారు. సమాజంలో, కార్యాలయాల్లో, ప్రయాణ సమయంలో, బహిరంగ ప్రదేశాల్లో, అలాగే సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల్లో మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల వేధింపుల గురించి అవగాహన కల్పించారు.
బస్టాప్‌లు, ప్రయాణ ప్రదేశాలు, కాలనీలు తదితర ప్రాంతాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, వెంబడించడం (స్టాకింగ్), అసభ్య సైగలు చేయడం వంటి చర్యలు వేధింపుల కిందకు వస్తాయని తెలిపారు. కుటుంబ గౌరవం, భయం, సామాజిక ఒత్తిడి కారణంగా సమస్యలను బయటకు చెప్పకుండా మౌనం వహించవద్దని సూచించారు. అదేవిధంగా పెళ్లికి ముందు లేదా తర్వాత పరిచయమైన వ్యక్తులు పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు లేదా ఇతర వివరాలతో బెదిరింపులకు పాల్పడినా మహిళలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి ఘటనల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
వేధింపులకు గురైన మహిళలు రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385కు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. మహిళలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, వనిత, నిర్వాహకులు అంజి, సిబ్బంది, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.