మంచిర్యాల, సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేసి, మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. మట్టి విగ్రహాలను వినియోగించడం వల్ల నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల్లో కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రకృతి పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.