మంచిర్యాల సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్మిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది విద్యార్థులకు షీ టీమ్ విధులు, లక్ష్యాలు, మహిళలు, బాలికల భద్రత కోసం అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా సమస్యలను ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, అనుమానాస్పద మెసేజ్లు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రహదారి భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు లేదా మహిళలు ఎలాంటి ఆపద, వేధింపులు లేదా సమస్యను ఎదుర్కొన్నా వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ వాట్సాప్ నంబర్ 8712659385ను సంప్రదించాలని సూచించారు. ఈ నంబర్లను విద్యార్థులు తమ ఫోన్లలో సేవ్ చేసుకోవడంతో పాటు అవసరమైన వారికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు వనిత, సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ వర్మ, వ్యాయామ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.