మంచిర్యాల, సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డీసీపీ ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్లతో కలిసి వినాయక చవితి వేడుకల సన్నాహకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.