మంచిర్యాల, సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు తో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వనిగా కాళోజీ నారాయణరావు నిలిచారని, తెలంగాణ ప్రజలందరికీ ఆయన సుపరిచితులని అన్నారు. తెలంగాణ వైతాళికుడిగా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడని, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా జీవించారని కొనియాడారు. కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థి దశలోనే నిజాం పాలనను ఎదిరించి, తెలంగాణలో విద్యా వ్యాప్తికి కృషి చేశారని గుర్తు చేశారు. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాళోజీ నారాయణరావు బహుభాషా కోవిదుడని, కవిగా, రచయితగా తెలుగుతో పాటు వివిధ భాషల్లో రచనలు చేశారని తెలిపారు. మానవ హక్కులు, కుల వివక్ష లేని సమాజం వంటి అంశాలపై ఆయన చేసిన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.