మంచిర్యాల సెప్టెంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )
తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతి, జీవనశైలికి అద్దం పట్టిన మహాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ సీబీఎస్ఈలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు తెలంగాణ జానపద నృత్యాలు, పాటలు, ఉపన్యాసాలతో అలరించారు. తెలంగాణ మాండలికంలోని మాధుర్యాన్ని, జానపద సంస్కృతిలోని గొప్పతనాన్ని తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప మాట్లాడుతూ.. తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని ప్రజల గుండెల్లో నిలిపిన కాళోజీ సాహిత్య సేవ చిరస్మరణీయమని కొనియాడారు. మాతృభాషపై మమకారం పెంపొందించుకోవడంతో పాటు తెలంగాణ మాండలిక భాషా వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిస్టర్స్ అనుప, జోష్మి, తెలుగు భాషా విభాగం ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.