Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:20 pm Posted by : Anjaneyulu Dega

రక్తదానంతో సేవా స్ఫూర్తిని చాటిన ఫోటోగ్రాఫర్లు

మంచిర్యాల, ఆగస్టు 25, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ శిబిరంలో మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 105 మంది ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రక్తనిధి కేంద్రం ఇన్‌చార్జ్ వి. మధుసూదన్ రెడ్డి, సంస్థ జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతార వేణి శ్వాస తిరుపతిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం తరఫున ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అలాగే రక్తదానం చేసిన 105 మంది సభ్యుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న సుధాకర్, కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ నూనె సురేష్ సమక్షంలో రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం ఎంతో విలువైన సేవా కార్యక్రమమని అన్నారు. ఫోటోగ్రాఫర్ల సంఘం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడటంలో భాగస్వాములైన 105 మంది ఫోటోగ్రాఫర్ల సేవా స్ఫూర్తిని పలువురు అభినందించారు.