మంచిర్యాల, ఆగస్టు 18, ( ఆంజనేయులు న్యూస్ )
విద్యార్థుల భద్రత, రక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాలనీ కేరళ మోడల్ హైస్కూల్లో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది విద్యార్థులకు షీ టీమ్ విధులు, ప్రధాన ఉద్దేశాలు, మహిళలు, బాలికల భద్రత కోసం అందిస్తున్న సేవలపై వివరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఏదైనా ఆపద లేదా సమస్య ఎదురైనప్పుడు వెంటనే డయల్ 112కు ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ వాట్సాప్ నంబర్ 8712659385ను సంప్రదించాలని, ఈ నంబర్లను విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ కానిస్టేబుళ్లు వనిత, సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.