Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 1:37 pm Posted by : Anjaneyulu Dega

ప్రమాదాలు జరుగుతున్నా.. గేదెల సమస్యపై అధికారుల మౌనం!

పట్టపగలు.. నడిరాత్రి.. రోడ్డుపైనే గేదెలు!

మంచిర్యాల, ఆగస్టు 18, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్లపై పగలు, రాత్రి గేదెల సంచారం వాహనదారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. హమాలీవాడ అండర్‌బ్రిడ్జి నుంచి సూర్యనగర్ వరకు కనీసం మూడు, నాలుగు ప్రాంతాల్లో గేదెలు రోడ్లపైనే సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై గేదెలు అడ్డంగా రావడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నా, పెద్దా ప్రమాదాలు నిత్యం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గేదెల కారణంగా బైక్ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగిన ఘటనలు ఉన్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. గేదెలను కట్టడి చేయాలని ఇప్పటికే మున్సిపల్ అధికారులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాహనదారులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? మరో ప్రాణం పోయే వరకు వేచి చూస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపై గేదెల సంచారంతో రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. చీకట్లో వాహనదారులకు గేదెలు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న గేదెలను గుర్తించి వాటి యజమానులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని, గేదెలను రోడ్లపై వదిలేస్తున్న యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి వాహనదారులు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.