మంచిర్యాల ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు మున్నా రాజా సిసోడియా, తుల మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలనే సంకల్పంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతమైన నాగారం గ్రామంలో గిరిజనుల ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతీయ పతాకాలతో గ్రామానికి వెళ్లిన తమను గిరిజనులు ఆప్యాయంగా స్వాగతించి, ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని వారు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్ర్య ఉద్యమం, ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన కొమురం భీమ్, అనభేరి ప్రభాకర్ రావు, దొడ్డి కొమురయ్య, బందగి తదితరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములై జాతీయ పతాకాన్ని తమ ఇళ్లపై ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నా రాజా సిసోడియా, తుల మధుసూదన్ రావు, మేడిపల్లి సత్యం, రాజ్కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.