Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:32 pm Posted by : Anjaneyulu Dega

33 జిల్లాలకు 33 మంది సమాచార హక్కు కమిషనర్లు కావాలి!

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ

మంచిర్యాల, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ )

సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది సమాచార హక్కు కమిషనర్లను నియమించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సూరస్రవతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. అయితే సమాచార హక్కు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక సమాచార హక్కు కమిషనర్‌ను నియమిస్తే ప్రజలకు సమాచార హక్కు చట్టం మరింత చేరువవుతుందని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, జాతీయ సహాయ కార్యదర్శులు వంగల వివేకానంద, మార్క నవీన్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి దూడెం శ్రీనివాస్, డి. విజయ భాస్కర్, అలిశెట్టి నర్సయ్య, రాథోడ్ సుభాష్ తదితరులు పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.