10 తులాల బంగారం స్వాధీనం.. నిందితుడు ధనుష్కు 14 రోజుల రిమాండ్
నిజామాబాద్ 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు వెల్లడి
నిజామాబాద్, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )
మైనర్ బాలలను ప్రలోభపెట్టి వారి ద్వారా బంగారం చోరీలు చేయించిన కేసులో ప్రధాన నిందితుడు ధనుష్ను నిజామాబాద్ 3వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ.. నిందితుడు ధనుష్ మైనర్ బాలలను లక్ష్యంగా చేసుకుని, వారిని ప్రేరేపించి వారి సొంత ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేయించి తనకు అప్పగించేలా పథకం రచించాడని తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు CCS ACP శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ధనుష్ పాత్ర బయటపడటంతో అతడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మైనర్ బాలలను నేరాలకు ప్రేరేపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరిబాబు హెచ్చరించారు.