Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 1:37 pm Posted by : Anjaneyulu Dega

తెరుచుకోని స్కూల్ గేటు.. గేటు దూకి పాఠశాలలోకి వెళ్లిన విద్యార్థులు

8:45 అయినా గేటు తెరవని సిబ్బంది.. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన

మంచిర్యాల, జూలై 15, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం నిర్లక్ష్యం వెలుగుచూసింది. పాఠశాల ప్రారంభ సమయం దాటినా ప్రధాన గేటు తెరవకపోవడంతో విద్యార్థులు గేటు ఎక్కి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8:45 గంటలు దాటినా పాఠశాల గేటు తెరుచుకోకపోవడంతో చిన్నారులు గేటుపైకి ఎక్కి ఆవరణలోకి దూకడం స్థానికులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగి పిల్లలకు గాయాలైతే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరుకావడం లేదని, కొందరు రోజువారీ విధుల్లో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..