మంచిర్యాల జూలై 11, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భీష్మ (సీఎస్–ఆర్ఎంఓ), డాక్టర్ శ్రీధర్ (ఆర్ఎంఓ) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్లు విడుదల చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 830 కోట్లకు చేరుకోగా, భారతదేశ జనాభా సుమారు 147 కోట్లతో ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు. జనాభా పెరుగుదలతో వనరుల కొరత, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం, ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి అనేక సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. అందువల్ల కుటుంబ నియంత్రణతో పాటు జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి అవగాహనతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ వి. వినయ్ కుమార్, లయన్ గోలి రాము, లయన్ కొత్త సురేందర్, ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు సోఫియా సుల్తానా, విజయలక్ష్మి, సిబ్బంది అరుణ, ఫాతిమా, వాణిశ్రీ, అనిత తదితరులు పాల్గొన్నారు.