Date of Publish : 11 July 2026, 12:56 pmPosted by : Anjaneyulu Dega
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. డీసీపీ కార్యాలయం ముందు ప్రమాదకర గుంత
వర్షంతో నిండితే కనిపించవు.. ప్రమాదం పొంచి ఉందంటున్న వాహనదారులు
మంచిర్యాల జులై 11, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం ఎదుట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన గుంతను కాంట్రాక్టర్లు భద్రతా చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు లేదా ప్రతిబింబించే సూచికలు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో గుంతలు వర్షపు నీటితో నిండిపోయే అవకాశం ఉంది. నీటితో నిండిన తర్వాత గుంతల లోతు కనిపించక ద్విచక్ర వాహనదారులు, కార్ల డ్రైవర్లు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.